Odisha Journalist : బాంబు పేలి జర్నలిస్టు మృతి
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
- chvmurthy
- Published On : February 6, 2022 / 08:18 AM IST
Odisha Journalist
Odisha Journalist : ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
కలహండిలో ఈనెలలో జరిగే ఐదు దశల పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి కొన్ని పోస్టర్లను, బ్యానర్లను పలు గ్రామాల్లో అంటించారు. రోహిత్ కుమార్ బిశ్వాల్(46) అనే వ్యక్తి భువనేశ్వర్ నుంచి ప్రచురితమయ్యే ప్రముఖ పత్రికకు చెందిన జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.
మదన్పూర్ రాంపూర్ బ్లాక్లోని దోమ్కర్లకుంటా గ్రామం వద్ద మావోయిస్టులు ఓ చెట్టుకు అతికించిన పోస్టర్లు, బ్యానర్ను చూస్తున్నాడు. ఆసమయంలో అక్కడ అమర్చిన ఐఈడీ బాంబు పేలి మరణించాడని కలహండీ ఎస్పీ డాక్టర్ వివేక్ చెప్పారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు బాంబులు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జర్నలిస్టు మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. రోహిత్కుమార్ కుటుంబానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. ఇందులో రూ.9 లక్షలు పోలీసులు అందించగా… మిగిలిన రూ. 4 లక్షలు జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు మానస్ మంగరాజ్ చెప్పారు.
ఇలాంటి పోస్టర్లు, బ్యానర్లు కనిపించినప్పుడు పోలీసులు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో బాంబు డిస్పోజబుల్ టీమ్ తోపరిశీలించి అప్పడు ముందుకు వెళతారు. భద్రతా దళాలు వెళ్లే లోపు రోహిత్ కుమార్ అక్కడకు చేరుకోవటంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Also Read : Social Media : కేసీఆర్పై అనుచిత పోస్ట్లు-ఆరుగురి రిమాండ్, మరో ఇద్దరిపై కేసు
రోహిత్ కుమార్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం ఈ ఘటననను ఖండించింది. వామపక్ష ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో పని చేసే జర్నలిస్టులకు సరైన భద్రత కల్పించాలని సంస్ద కోరింది.
