Kadapa ATM Theft Case : కడపలో ఏటీఎంల చోరీ కేసులో నిందితుల అరెస్ట్
కడప జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు ఏటీఎంలలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
- chvmurthy
- Published On : December 12, 2021 / 03:46 PM IST
Kadapa Atm, Chory Case
Kadapa ATM Theft Case : కడప జిల్లాలో సంచలనం సృష్టించిన రెండు ఏటీఎంలలో దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాలోని చింతకొమ్మ దిన్నె మండలంలోని కె.ఎస్.ఆర్.ఎం. కళాశాల సమీపంలోని ఎస్.బి.ఐ. ఎటిఎం, కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్.బీ.ఐ ఏటీఎం లోనూ చోరీకి పాల్పడిన ఇద్దరు ఒకే ముఠాకు చెందిన వారని ఆయన తెలిపారు. భారీ వాహనం లోడుతో వెళ్తున్నట్లు నటిస్తూ, అందులో వారికి కావాల్సిన వాహనాలు, ఆయుధాలను తరలించే వారన్నారు.
స్కూటర్ లో ప్రయాణిస్తూ రెక్కీ నిర్వహించిన అనంతరం ఈ ముఠా చోరీకి పాల్పడ్డారని ఆయన తెలిపారు. రెండు ఏటీఎంలలోను మొదట ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి సీసీ కెమెరాలకు నల్ల రంగు వేసి 7 నిమిషాల్లో గ్యాస్ కట్టర్ లతో ఏటిఎం మిషిన్ లను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి చోరీకి పాల్పడ్డారు అని తెలిపారు. చోరీ అనంతరం నగదు గ్యాస్ కట్టర్ లు టూ వీలర్ వాహనాలతో పాటు భారీ లారీలలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఈ ముఠా నాయకుడు రాజస్థాన్కు పరారయ్యాడు.
కేవలం చోరీ జరిగిన 4 రోజుల వ్యవధిలోనే కడప పోలీసులు దొంగలను అరెస్టు చేసారు. వీరి వద్ద నుండి రూ.9.5 లక్షల రూపాయల నగదు, లారీ, రెండు నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, రెండు చిన్న గ్యాస్ సిలిండర్ లు, ఒక చిన్న ఎల్పీజీ సిలిండర్, 40 దేశీ ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, రెండు పొడవాటి పైపులు, నల్లని రంగు స్ప్రే డబ్బా, ఇనుప సమ్మెట, జంపర్ రాడ్లు, ఐరన్ కట్టర్, పొడవాటి స్క్రూ డ్రైవర్, అడ్జస్టబుల్ స్పానర్, కేబుల్ కట్టర్, రెండు గ్యాస్ రిలీసింగ్ స్పానర్లు, రెండు ఇనుప నిచ్చెన లు స్వాధీనంచేసుకున్నారు.
Also Read : Telugu States : తాగుబోతుల ర్యాష్ డ్రైవింగ్..తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు
పట్టుబడ్డ ఇద్దరు నిందితులు హర్యానా కు చెందిన కరుడు గట్టిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లుని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి దొంగతనం చేసిన దొంగలు. దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మే వాత్ గ్యాంగ్ గా పిలవబడే ఈ నేరస్తులు ఆంధ్ర ప్రదేశ్ లోని కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో జరిగిన చోరీలకు సంబంధం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాలలోని హైదరాబాద్, నిజాంబాద్, కామారెడ్డి జిల్లాలలో జరిగిన చోరీలు చేసింది కూడా ఈ ముఠా సభ్యులే నని ని జిల్లా ఎస్పీ తెలిపారు.
