Double Murder In Prakasam District : వ్యవసాయ కూలీ మేస్త్రీగా పనిచేసే మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడో భూతవైద్యుడు. ఆగ్రహించిన గ్రామస్తులు అత్యాచారం చేసిన వ్యక్తిపై దాడిచేయటంతో ఆవ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో చోటు చేసుకుంది.
జిల్లాలోని కామేపల్లికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి(42) వ్యవసాయ కూలీ మేస్త్రీగా జీవిస్తోంది. సోమవారం ఉదయం పొలంలో పనులు ఉండటంతో కూలీల కోసం ఆదివారం రాత్రి గం.8-30 సమయంలో వుడ్డెపాలెంకు వెళ్లింది. అక్కడ కూలీలతో మాట్లాడే సమయంలో అదే కాలనీకి చెందిన వల్లెపు ఓబయ్య(51) అనే భూతవైద్యుడు విజయలక్ష్మిని చూశాడు.
Also Read : Extrta Marital Affair Murder : యువకుడ్ని హత్యచేసి… శవం పోలీసు స్టేషన్లో అప్పగించి లొంగిపోయిన నిందితులు
ఆమెను అనుభవించాలనే దుర్భుధ్దితో ఆమెతో మాటలు కలిపాడు. ఈక్రమంలో విజయలక్ష్మి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. తాను నొప్పులు తగ్గించేందుకు మందులు ఇస్తానని నమ్మబలికాడు. ఇంట్లోకి తీసుకకెళ్ళిన తర్వాత ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఊహించని పరిణామానికి హతాశురాలైన విజయలక్ష్మి అతడ్ని తీవ్రంగా ప్రతిఘటించింది.
అత్యాచారం విషయం బయటకు తెలిస్తే తనకు ఇబ్బంది వస్తుందని గ్రహించిన ఓబయ్య ఆమెపై దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేశాడు. అనంతరం గొడ్డలితో నరికి ప్రాణం తీశాడు. ఆమె హత్య గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు జరుగుమల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రజియా సుల్తానా తన సిబ్బందితో ఘటనా స్ధలానికి వచ్చి పరిస్ధితి సమీక్షించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి ఓబయ్యను అదుపులోకి తీసుకుంది.
ఈలోగా ఓబయ్య విజయలక్ష్మిని హత్యచేశాడని తెలుసుకున్న గ్రామస్తులు అతని ఇంటివద్దకు చేరుకున్నారు. అప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని వాహనంలో ఎక్కించుకుని పోలీసు స్టేషన్ కు భయలు దేరారు. ఓబయ్యపై కోపంతో రగిలిపోయిన గ్రామస్తులు పోలీసు వాహనాన్ని అడ్డుకుని ఓబయ్యను వాహనం నుంచి బయటకు లాగి కర్రలతో చితకబాది చావగొట్టారు.
గ్రామస్తులను అడ్డుకోబోయిన ఎస్సై రజియా సుల్తానా పైనా దాడి చేశారు. గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓబయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మహిళపై అత్యాచారం హత్య, నిందితుడిపై గ్రామస్తుల దాడి…హత్యతో జరుగుమల్లి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్ధలంలోనే ఉన్న ఎస్సై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటంతో గ్రామానికి అదనపు బలగాలను పంపించారు. ఉన్నతాధికారులు గ్రామానికివచ్చి పరిస్ధితి సమీక్షించారు.
హత్య, ప్రతీకార హత్య జరిగిన నేపధ్యంలో పోలీసులు అన్నివిషయాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయలక్ష్మి హత్య జరిగిన ప్రదేశంలో క్షుద్రపూజలు జరిగినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే ఓబయ్య క్షుద్రపూజలు కూడా చేస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు.
విజయలక్ష్మిపై అత్యాచారం చేస్తుంటే ప్రతిఘటించిందని హత్య చేశాడా….. లేక క్షుద్రపూజలలో భాగంగా హత్యచేశాడా అనే విషయం తేలాల్సి ఉంది. మహిళ మృతదేహాంపై కొంతభాగం దుస్తులు లేకపోవటంతో అత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఓబయ్యపై ప్రతి దాడికి దిగిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.