Pattabhi Shifted Rajahmundry Central Jail : టీడీపీ నేత పట్టాభి రామ్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు నడుమ పట్టాభితో పాటు మరో 10 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. గన్నవరం ఘటనలో పట్టాభి రామ్ అరెస్ట్ అయ్యారు. సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టాభితో సహా 10 మంది టీడీపీ కార్యకర్తలపై 6 సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేశారు. ఎ1 గా పట్టాభి, ఎ2 గా చిన్నా ఉన్నారు. గన్నవరం సబ్ జైల్ నుండి పట్టాభితో పాటు 10 మంది టీడీపీ నాయకులు మొత్తం 11 మందిని భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
గన్నవరం సబ్ జైల్లో భద్రత ఇబ్బందిగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. భారీగా టీడీపీ నాయకులు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. దీనిని కంట్రోల్ చేయలేమంటూ గన్నవరం కోర్టుకు పోలీసులు విన్నవించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పట్టాభితో పాటు 10 మంది కార్యకర్తలను రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కాగా, పోలీసులు తనను ముసుగు వేసి తీవ్రంగా కొట్టారని పట్టాభి కోర్టులో కూడా చెప్పారు.
TDP Pattabhi Ram: టీడీపీ నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్.. గన్నవరం ఘర్షణల కేసులో కోర్టు ఆదేశం
అయితే, పట్టాభిని పోలీసులు ఎలాంటి మ్యాన్ హ్యాండిల్ చేయలేదని కృష్టా జిల్లా ఎస్పీ జాషువా చెప్పారు. ఆయన్ను కొట్టాల్సిన అవసరం లేదన్నారు. పట్టాభి కావాలనే గతంలో ఉన్న ఫొటోలను బ్లాక్ చేసి పోలీసులు కొట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా చెప్పారు. కృష్ణా జిల్లా నుంచి కొద్దిసేపటి క్రితమే పట్టాభిని భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే అంబాపురం టోల్ గేట్ తోపాటు మిగతా టోల్ గేట్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి వాహనాలు ఫాలో అవ్వకుండా ముందు 2 ఎస్కాట్, వెనక 1 ఎస్కాట్ తో పట్టాభిని పోలీసులు తరలించారు. అలాగే హైవే పైన ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారికి ఎస్కాట్ తో రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైనా వెహికల్ ను ఫాలో అవుతున్నారన్న అనుమానం వచ్చిన వెంటనే ఎస్కాట్ వద్ద ఉన్న సిబ్బందిని అలర్ట్ చేశారు.