Terrorist Encounter: ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారు
ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు.
- Bharath Reddy
- Published On : January 8, 2022 / 07:47 AM IST
Terror
Terrorist Encounter: మధ్యకాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో భారత భద్రతా దళాలు మట్టుపెట్టిన ముగ్గురు ఉగ్రవాదులు జైష్-ఎ-ముహమ్మద్ (జెఈఎం) సంస్థకు చెందిన వారుగా సైన్యాధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జరిగిన ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించిన అధికారులు.. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు జైష్-ఎ-ముహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వసీమ్ మీర్ గా గుర్తించారు. దీని ఆధారంగా మిగతా ఇద్దరు ఉగ్రవాదులు సైతం అదే ఉగ్రవాద సంస్థకు చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Also read: Corona Flight: దేశంలోకి కరోనాను మోసుకొస్తున్న విమాన ప్రయాణికులు
శ్రీనగర్ లోని నౌగామ్ కు చెందిన వసీమ్ మీర్ డిసెంబర్ 2020 నుంచి క్రియాశీలక ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 2021 జూన్ 22న పోలీసు ఇన్స్పెక్టర్ పర్వాయిజ్ అహ్మద్ ను హత్య చేసినట్లు రికార్డుల్లో ఉంది. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలకు సంబంధించి వసీమ్ మీర్ పై పలు కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్ లోని ఈద్గా వద్ద ఆలీ మసీదు చౌక్ సమీపంలో సిఆర్పిఎఫ్ బంకర్ పై వసీమ్ మీర్ జరిపిన దాడిలో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. సెంట్రల్ కాశ్మీర్ యువతను ఉగ్రవాద చర్యలకు పాల్పడే విధంగా వసీం మీర్ ప్రేరేపించేవాడని..శ్రీనగర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి ఉంటారని, త్వరలో వారి వివరాలు కూడా సేకరిస్తామని విజయ్ కుమార్ తెలిపారు. ఇక బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్ తో కలిపి గత ఏడు రోజుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 11కి చేరుకుంది.
Also read: North Korea : కిమ్ను తిడుతూ రాతలు..చేతిరాత నమూనాల పరిశీలన
