అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు బెంగళూరు నుంచి నాందేడ్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో బయలుదేరాడు.
ఆదివారం(నవంబర్ 24, 2019) రైలు గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల రైల్వే స్టేషన్ కు రాగానే గుర్తు తెలియని నలుగురు దుండగులు అతని దగ్గర ఉన్న రూ. 50 వేలు లాక్కొని కదులుతున్న రైలు నుంచి కిందకి తోసేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు.
చికిత్స కోసం అతన్ని స్థానికులు గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించారు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.