నెల్లూరు జిల్లా నేతాజీ నగర్ లో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై నిర్వహించిన సర్వేలు కలకలం రేపాయి.
నెల్లూరు : జిల్లాలో ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన సర్వేలు కలకలం రేపాయి. నేతాజీ నగర్ లో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముగ్గురు యువకులు సర్వే నిర్వహించారు. ఈ విషయంపై వైసీపీ కార్యకర్తలు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసి, యువకులను అప్పగించారు. అయితే వైసీపీ కార్యకర్తలపైనే పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు.
వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తుల వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ నర్సింహరావుతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఫిర్యాదు చేసిన వారిపై కేసులు ఎలా పెడతారని సీఐని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం జరిగింది. పోలీసుల తీరుపై వైసీపీ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.