కదులుతున్న డొంక : జయరామ్ హత్య..మరో పోలీసుపై బదిలీ వేటు

  • Publish Date - February 17, 2019 / 02:17 AM IST

జయరామ్‌ హత్య కేసులో మరో పోలీస్‌ అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జయరామ్‌ హత్య తర్వాత రాకేష్‌ మొదట కాల్‌ చేసింది రాంబాబుకే అని పోలీసు అధికారులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌ల కస్టడీని నాంపల్లి కోర్టు ఈనెల 23కు వరకు పొడిగించింది.

* జయరాం మర్డర్‌ కేసు విచారణ ముమ్మరం
* మరో పోలీసు అధికారిపై బదిలీ వేటు
* రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో పోలీస్‌ అధికారిపై ఖాకీలు బదిలీవేటు వేశారు. రాయదుర్గం సీఐ రాంబాబును కార్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. జయరాం హత్య తర్వాత రాకేష్‌రెడ్డి…. తొలుత సీఐ రాంబాబుకే ఫోన్‌ చేసి మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీఐ రాంబాబుపై చర్యలు తీసుకున్నారు. అయితే మరో ఇద్దరు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో వాళ్ల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
జయరాం మర్డర్‌ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు అంజిరెడ్డి, శ్రీను, రామును ప్రశ్నించారు. సిరిసిల్లకు చెందిన ఓ కౌన్సిలర్‌ భర్తను కూడా అదుపులోకి తీసుకన్నారు. రాకేష్‌తో కలిసి నిందితులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాకేష్‌రెడ్డి తనకు 10 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా అంజిరెడ్డి పోలీసులకు తెలిపారు. జయరాం మర్డర్‌ తర్వాత రాకేష్‌… తనను ఇంటికి పిలిచినట్టు అంజిరెడ్డి చెప్పారు. జయరాం డెడ్‌బాడీ చూసి అక్కడి నుంచి పారిపోయానని పోలీసులకు వివరించారు. మర్డర్‌ విషయాన్ని రహస్యంగా ఉంచడంపైనా పోలీసులు అంజిరెడ్డిపై పలు ప్రశ్నలు సంధించారు. విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు రానున్నాయో చూడాలి.