AP TET 2024 Notification : ఏపీ టెట్ (AP-TET 2024) నోటిఫికేషన్ విడుదలకు ముహుర్తం ఖరారు అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీ విద్యాశాఖ రేపు ( సోమవారం) టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూలై 2వ తేదీ నుంచి టెట్ దరఖాస్తులను స్వీకరించనుంది. మిగతా వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని http://cse.ap.gov.in/ వెబ్సైట్ సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సూచించారు.
ఏపీ టెట్ (జూలై) 2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం, షెడ్యూల్, నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్లైన్ విధానంలో (CBT) జరుగు పరీక్షలు గురించి అభ్యర్థులకు సూచనలు, విధివిధానాలు అన్నీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. టెట్ అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం జూలై 2 నుంచి సీఎస్ఈ వెబ్సైట్లోని వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర సమాచారాన్ని పొందడానికి కమిషనర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను సంప్రదించవచ్చు.
టెట్ ఫలితాల్లో అర్హత సాధించని అభ్యర్థులకు, ఇటీవలే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో అవకాశం కల్పిస్తూ త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఆ వెంటనే మెగా డీఎస్సీ కూడా ఉండబోతుందని చెప్పారు. టెట్ అర్హత సాధించని అభ్యర్థుల కోసం మళ్లీ టెట్ నిర్వహిస్తామనే హామీ మేరకు జూలై 1న టెట్ పరీక్షకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ను విడుదల కానుంది.
పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు :
కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం జారీ చేసిన పాత డీఎస్సీ నోటిఫికేషన్ను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వంలో 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. దీనికి సంబంధించి మరో మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
Read Also : ఏం తేలుస్తారు? పోలవరంలో అమెరికా, కెనడా నిపుణుల బృందం