CBSE Students
CBSE Syllabus: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 విద్యా సంవత్సరం కోసం కీలక మార్పులు చేసింది. 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్ ను ప్రకటించడంతోపాటు.. 10వ తరగతి విద్యార్థులకు రెండు సార్లు పరీక్షలు నిర్వహించనుంది. 12వ తరగతికి తొమ్మిది పాయింట్ల గ్రేడింగ్ విధానం అమలు చేయనుంది.
విద్యా వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందించేందుకు 10, 12వ తరగతుల సబ్జెక్టులు, పరీక్షల విధానంలో భారీగా మార్పులు చేసినట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు మూడు నైపుణ్య ఆధారిత సబ్జెక్టులో ఒకదాన్ని ఎంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. వీటిలో కంప్యూటర్ అప్టికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టులు ఉన్నాయి. అదనంగా విద్యార్థులు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ లేదా హిందీని ఒకటిగా ఎంచుకోవాలి. దీనిని వారు 9 లేదా 10వ తరగతిలో తీసుకోవచ్చు.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. ఒక విద్యార్థి సైన్స్, గణితం, సాంఘీక శాస్త్రం లేదా ఒక లాంగ్వేజ్ సబ్జెక్టులలో ఫెయిల్ అయితే, తుది ఫలితాలకోసం ఉత్తీర్ణత సాధించిన నైపుణ్య సబ్జెక్టు, మీరు ఎంచుకున్న లాంగ్వేజ్ సబ్జెక్టుతో భర్తీ చేయొచ్చు. పరీక్షల విషయానికొస్తే, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇకపై ఫిబ్రవరి, ఏప్రిల్లో రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది.
12వ తరగతి సిలబస్ లోనూ మార్పులు చేర్పులు చేసింది. ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేట్, ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్, డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ వంటి నాలుగు కొత్త నైపుణ్య ఆధారిత (skill-based) ఎంపికలను ప్రవేశపెట్టింది. సవరించిన 12వ తరగతి పాఠ్యాంశాలలో ఏడు ప్రధాన రంగాలకు చెందిన అంశాలను కవర్ చేస్తుంది. 12వ తరగతి విద్యార్థులకు మాత్రం యేటా ఒక్కసారే పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. 2026 ఫిబ్రవరి 17న బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందని బోర్డు పేర్కొంది. అయితే, మార్కులకు బదులుగా 12వ తరగతిలో 9పాయింట్ల గ్రేడ్ విధానాన్ని తీసుకొచ్చింది.