JEE NEET Merge : విద్యార్థులకు అలర్ట్.. నీట్-జేఈఈ విలీనం.. ఇకపై ఒకటే పరీక్ష..!
JEE NEET Merge : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను విలీనం చేయనుంది.
- Dharani Pilli
- Updated on- May 24, 2026 / 06:13 PM IST
Centre is considering One entrance test for JEE and NEET
- కేంద్రం కీలక నిర్ణయం
- నీట్-జేఈఈ విలీనం
- ఇకపై రెండు గ్రూపులకు ఒక్కటే పరీక్ష
JEE NEET Merge : నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే మరోసారి పరీక్ష నిర్వహించబోతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆసక్తికర వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఇకపై ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాధాకృష్ణన్ కమిటీ ఈ ప్రతిపాదన చేసింది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం విడివిడిగా నిర్వహిస్తున్న జేఈఈ, నీట్లను ఇకపై విలీనం చేసి.. ఒకే జాతీయ ప్రవేశ పరీక్షా విధానాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది.
జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా, ఇంజనీరింగ్, Medical ప్రవేశ పరీక్షలను ఏకీకృతం చేయాలనే ఈ ప్రతిపాదన.. విభిన్న విద్యా విభాగాల మధ్య ప్రవేశ మార్గాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం అమలులోకి వస్తే.. ఇకపై విద్యార్థులు ప్రత్యేక సెక్షన్లు కలిగిన ఒక్కటే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అందులో ఇంజనీరింగ్ చదవాలనుకునే వారి కోసం మ్యాథమెటిక్స్, మెడికల్ ఆస్పిరెంట్స్ కోసం బయాలజీ సెక్షన్లు ఉంటాయి.
*నీట్ పరీక్ష రద్దు.. తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య..!
మే 21న జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులకు ఈ ప్రతిపాదనను వివరించినప్పుడు.. దీనిపై సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానంతో పాటుగా.. నీట్ (NEET) అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితులు, ప్రయత్నాల (attempts) సంఖ్యపై ఉన్న పరిమితులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారులు తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారికి మరింత సౌలభ్యాన్ని కల్పించడానికి పరీక్షలను బహుళ సెషన్లలో, వేర్వేరు దశల్లో నిర్వహించడానికి కేంద్రం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
గత రెండేళ్లలో నీట్ పేపర్ లీక్ కావడంతో.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సమావేశం జరగడం.. ఇలాంటి ప్రతిపాదన రావడం గమనార్హం. ఇప్పటికే కేంద్రం రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులలో దాదాపు 70 శాతం ఇప్పటికే అమలు చేసిందని ప్యానెల్కు తెలిపారు. అలానే కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంపై కూడా చర్చించారు. అలాగే ప్రశ్నా పత్రాలు రూపొందించేందుకు ఇకపై బయటి వ్యక్తుల సేవలను వినియోగించుకోరాదని.. థర్డ్ పార్టీ ఏజెన్సీల సేవలను వినియోగించుకోవద్దని నిర్ణయించినట్టు ఎన్టీఏ అధికారులు తెలిపారు.
