Telugu to English : తెలుగు నుండి ఆంగ్ల మాధ్యమంలోకి…ఉన్నత విద్యామండలికి కళాశాలల దరఖాస్తు
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ నేపధ్యంలో ఇప్పటి వరకు 555 డిగ్రీ కళాశాలలు మీడియం మార్పు కోసం ఉన్నత విద్యా మండలికి ధరఖాస్తు చేశాయి.
- Guntupalli Ramakrishna
- Published On : July 15, 2021 / 11:01 AM IST
తెలుగు నుండి ఆంగ్ల మాధ్యమంలోకి
Telugu to English : మారుతున్న పరిస్ధితులు, విద్యార్ధుల ఆసక్తికి అనుగుణంగా ఏపిలోని విద్యాసంస్ధలు పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఇప్పటి వరకు కళాశాల్లో ఉన్న తెలుగు మీడియం కోర్సులను ఇక పై ఇంగ్లీషు మీడియంలో కొనసాగింపుకు మొగ్గు చూపుతున్నాయి. దీనితోపాటు విద్యార్ధుల నుండి ఆదరణ లేని కోర్సులను ఉపసంహరించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాయి. ఏపి అంతటా డిగ్రీ కోర్సుల్లో పూర్తిస్ధాయిలో ఆంగ్ల మాధ్యమ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ఆమేరకు కళాశాలలు మీడియం మార్పు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధిచిన నోటిఫికేషన్ ను జారి చేసింది.
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ నేపధ్యంలో ఇప్పటి వరకు 555 డిగ్రీ కళాశాలలు మీడియం మార్పు కోసం ఉన్నత విద్యా మండలికి ధరఖాస్తు చేశాయి. ఏపిలో 154 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, 111 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు, 1,022 అన్ ఎయిడెడ్ కళాశాలు ఉన్నాయి. సగానికి పైగా కళాశాలు ఇంకా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉంటే విద్యార్ధుల నుండి ఆదరణ లేకపోవటం కారణంగా నిరుపయోగంగా ఉన్న కోర్సులను ఉపసంహరించుకుంటూ 111 కళాశాలు ధరఖాస్తు చేశాయి. వచ్చిన దరఖాస్తులపై ఉన్నత విద్యామండలి అధికారులు పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.
మీడియం మార్పుకోసం కళాశాలు ప్రతిపాదనలు సమర్పించకుంటే ఇకపై కళాశాలకు కోర్సులను నిర్వహించుకునే వీలుండదు. ప్రభుత్వ నిర్ణయం, గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలోనే చదివి వచ్చిన విద్యార్ధులుకు ఇబ్బందికరంగా మారింది. ఈ విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం అమలైతే వారంతా తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.
