మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం…కేంద్రం పరీక్ష ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు

మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం…కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేలా జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం….కేంద్రం నిర్వహించే పరీక్ష ఫలితాల్లో స్కోర్ ఆధారంగానే తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడతామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

దేశంలో ఈ రకమైన నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దీని వల్ల అభ్యర్థులు అనేక పరీక్షలు రాసే శ్రమంతో పాటు ఇందుకోసం పలు ప్రాంతాలకు వెళ్లే అవసరం కూడా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలు సైతం అభ్యర్థులకు ఊరట కలిగించే ఈ నిర్ణయం తీసుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

కాగా, NRA ఏర్పాటు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా ఇటు ప్రభుత్వం, అటు అభ్యర్థులు ఖర్చు తగ్గుతుంది. సమయం కూడా కలిసి వస్తుంది.

ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అయితే వేర్వేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తున్నారు. రైల్వే, ONGC, NTPC, బ్యాంకులు పలు ఉద్యోగాలకు ఆయా శాఖలే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కాగా, ఇకపై వీటన్నింటింటికీ ఒకే పరీక్ష (CET) నిర్వహిస్తారు. ఆ పరీక్షలో సాధించిన స్కోరుకు మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.