siddaramaiah, kharge and randeep
Karnataka Polls: వచ్చే నెలలో జరగబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. బుధవారం ఆయన వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దాని మీద సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. ఎన్నికల అనంతరం పార్టీ హైకమాండే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
Karnataka polls: కర్ణాటక ఎన్నికల స్టార్ క్యాంపైనర్లను ప్రకటించిన కాంగ్రెస్.. జాబితాలో రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని కులాల ఆధారంగా ఓట్లు అడగదని సిద్ధరామయ్య అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల నుంచి తామె ఓట్లను ఆశిస్తామన్నారు. కర్ణాటకలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి వరుసగా గెలవలేదు. దీంతో ఈసారి కచ్చితంగా తమకే అవకాశమని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఒపీనియన్ పోల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని చెప్పాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.