Kamineni Hospitals : భారత్లో మొదటిసారిగా పోలియో బాధితుడికి ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 45 ఏళ్ల భాస్కర్ అనే వ్యక్తి.. వృత్తిరీత్యా టైలర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. గత మూడేళ్లుగా పాక్షిక పోలియోతో అతడి ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది.
Read Also : సెల్ఫోన్తోనే సీక్రెట్గా మహిళల వీడియోలు తీశాడు- స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలపై సీపీ
దాంతో అతడిని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి గుండెమార్పిడి విభాగాధిపతి, కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి. ఖంటే, కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ దేశ్ముఖ్ వైద్య బృందం అసాధారణ సర్జరీని విజయవంతం చేసింది. ఆస్పత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలతో సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు.
బాధిత వ్యక్తి భాస్కర్ గుండె సమస్యతో గుండె పనితీరు మందగించడం, సరిగా కొట్టుకోకపోవడం, రక్తసరఫరా లేకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అతడికి తప్పనిసరిగా గుండెమార్పిడి చేయాల్సిందిగా వైద్యులు సూచించరు. ఈ ఆపరేషన్ కోసం దాదాపు 5 గంటలకు పైగా సమయం పట్టింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తి గుండెను దానం చేసేందుకు ముందుకు రావడంతో ఆయన కుటుంబసభ్యులు భాస్కర్ పాత గుండెను తీసి, కొత్తదాన్ని అమర్చారు. అంతేకాదు.. రక్తనాళాలు, ఇతర నరాలను కచ్చితత్వంతో అనుసంధానించారు.
ఈ అరుదైన ఆపరేషన్ గురించిడాక్టర్ విశాల్ వి. ఖంటే మాట్లాడుతూ.. “శస్త్రచికిత్స విజయవంతమైంది. బాధిత భాస్కర్ కోలుకుంటున్నాడు. తన రోజువారీ కార్యకలాపాలు చేసుకోగలడు. తీవ్రమైన అలసటతో మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొంచెం దూరం నడుస్తున్నాడు. అతి త్వరలోనే సాధారణ జీవితంలోకి అడుగు పెడతాడు. సర్జరీ అనంతరం భాస్కర్ను పరిశీలించాలి. కొత్త గుండెను శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు అవసరమైన మందులను అతడు తప్పనిసరిగా వాడుతుండాలి. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పరిశీలిస్తోంది” అని పేర్కొన్నారు.
కామినేని ఆస్పత్రి సీఓఓ, డాక్టర్ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. “కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను కామినేని ఆస్పత్రిలో విజయవంతంగా పూర్తిచేశాం. గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ శస్త్రచికిత్స చేసిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్లు డాక్టర్ విశాల్ ఖాంటే, రాజేశ్ దేశ్ముక్, చీఫ్ కార్డియాక్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ సురేష్కుమార్ ఎసంపల్లి, కన్సల్టెంట్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ రవళి సాడే, సుశిక్షితులైన ఐసీయూ సిబ్బంది, నర్సింగ్ బృందం కీలక పాత్ర పోషించారు” అని తెలిపారు.
కామినేని ఆస్పత్రిలోని వైద్యులు తనకు సరికొత్త జీవితాన్ని అందించారని భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. నైపుణ్యం, నిబద్ధత లేకపోతే తాను కోలుకునేవాడిని కానన్నారు. వైద్యులు సూచించిన మందులు కచ్చితంగా వాడుతున్నాని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి గురించి అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నానని భాస్కర్ చెప్పారు.