Jackfruit Powder For Diabetes Control
Diabetes : మధుమేహంతో ప్రస్తుతం అధిక శాతం మంది బాధపడుతున్నారు. దీనిని అదుపు చేసేందుకు వైద్యరంగంలో చేయని పరిశోధనంటూ లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రి మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఎ. గోపాలరావుతో పాటు ఇతర వైద్య బృందం చేసిన పరిశోధన మధుమేహవ్యాధి గ్రస్తులకు కొంత ఊరటనిచ్చేదిగా చెప్పాలి.
అదేంటంటే పనసకాయ పొడితో మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చన్న విషయం ఈ వైద్యబృందం జరిపిన పరిశోధనల్లో తేటతెల్లమైంది. ఈ బృందం పరిశోధనలు సైతం అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమైంది. పనసకాయలో మధుమేహాన్ని అదుపు చేయగలిగిన ఫైబర్, మినరల్స్, యాంటీ డయాబెటిస్ పదార్ధాలు ఉన్నాయని గుర్తించారు.
2019లో 40 మంది మధుమేహ వ్యాధిగ్రస్ధులపై ఏడాదికి పైగా పరిశోధన చేసినట్లు డాక్టర్ గోపాల రావు వెల్లడించారు. వారందరికి పనసపొడిని అందించటం ద్వారా పరిశీలన జరపగా టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఫ్లాస్మా గ్లూకోజ్ స్ధాయి తగ్గించటంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించగలిగామన్నారు.
18 నుండి 60ఏళ్ళ వయస్సువారిలో షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చిందని, ఆఫలితాలతో నేచర్ జర్నల్ కు పరిశోధనా పత్రాన్ని సమర్పించామని చెప్పారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనసపండ్లు విరివిగా లభిస్తుంన్నందున షుగర్ వ్యాధి గ్రస్ధులు ప్రతిరోజు బోజనంలో ఒక టేబుల్ స్పూన్ పనసపౌడర్ ను తీసుకుంటే చక్కెర అదుపులోకి వస్తుందని చెప్పారు. ఈపరిశోధన చేసిన వైద్య బృందంలో తనతోపాటు, సహచర వైద్యులు కె.సునీల్ నాయక్, రీసెర్చ్ వైద్యులు మురళీధర్ , శ్రీనివాస్ లు ఉన్నట్లు డాక్టర్ గోపాలరావు చెప్పారు.