చలో ట్యాంక్ బండ్ : ఆర్టీసీ జేఏసీ నేతల ముందస్తు అరెస్టు

  • Publish Date - November 9, 2019 / 01:42 AM IST

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌కు వెళ్లకుండా ముందస్తుగా పలువురు కార్మికులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకు నేతలను తరలించారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో.. పోలీసులు, కార్మిక నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తనను ముందస్తు అరెస్ట్ చేయడంపై.. రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం  చేశారు. కాసేపు.. పోలీసులకు, రాజిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అక్రమ అరెస్టులను ఆర్టీసీ జేఏసీ నాయకులు ఖండిస్తున్నారు. 

తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ..2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు నో చెప్పారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా..నిరసన దీక్ష చేపట్టి తీరుతామని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్ని నిర్బంధాలెదురైనా చలో ట్యాంక్ బండ్ జరిపి తీరతామన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కార్మిక నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. కార్మికులంతా పాల్గొని.. చలో ట్యాంక్‌బండ్‌ను విజయవంతం చేయాలని కోరారు. హైకోర్టు సూచనలను దృష్టిలో పెట్టుకొని.. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. చలో ట్యాంక్‌బండ్‌కు సంబంధించి.. ముందస్తు అరెస్టులు సరికావన్నారు.
Read More : వాహనదారులకు గమనిక : ట్యాంక్ బండ్ క్లోజ్