ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో పిడుగులాంటి వార్త అందుతోంది.. హికా తపాను లక లక అంటూ దూసుకొస్తోంది. తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా వచ్చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హికా తుపాను దూసుకొస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హికా తుపానుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
మరో 48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ, రాజస్థాన్, విదర్భ, చత్తీస్ఘడ్, బెంగాల్లో కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలిండియా వార్నింగ్ బులెటిన్లో వాతావరణశాఖ తెలిపింది.
బీహార్, జార్ఖండ్, బెంగాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దూసుకొస్తున్న తుపానును తల్చుకొని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Read More : బ్రేకింగ్ : నిండిన హుస్సేన్ సాగర్..నీరు విడుదల