Hyderabad Bungee Jumping: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. హుస్సేన్సాగర్ తీరాన బంగీ జంప్ అడ్వెంచర్.. హెచ్ఎండీఏ క్రేజీ ప్లాన్
హైదరాబాద్ నగరవాసులను, పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (Hyderabad Bungee Jumping) సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
- V Santhosh Kumar
- Published on- July 13, 2026 / 08:01 AM IST
HMDA to launch a bungee jumping adventure at Hyderabad Hussain Sagar.
- సాగర్ తీరాన బంగీ జంప్
- త్వరలో సరికొత్త అడ్వెంచర్ గేమ్స్
- అందుబాటులో తక్కువ టికెట్ ధరలు
Hyderabad Bungee Jumping: హైదరాబాద్ నగరవాసులను, పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హుస్సేన్సాగర్ తీరాన ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కుల్లో సరికొత్త అడ్వెంచర్ క్రీడలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సందర్శకుల కోసం ‘బంగీ ట్రాంపోలిన్(Hyderabad Bungee Jumping)’ (బంగీ జంప్), పిల్లల వినోదం కోసం ‘కిడ్స్ ట్రాంపోలిన్’ సౌకర్యాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయని హెచ్ఎండీఏ పరిధిలోని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
నిర్వహణ బాధ్యతలు, లొకేషన్లు ఇవే:
సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి అడ్వెంచర్ క్రీడలను ఇక్కడ ప్రవేశపెట్టడం ద్వారా పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ గార్డెన్స్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద, అలాగే లుంబినీ పార్కులోని తెలంగాణ టూరిజం బోటింగ్ టికెట్ కౌంటర్ వెనుక భాగంలో స్థలాలను ఎంపిక చేశారు. ఈ అడ్వెంచర్ జోన్ల ఏర్పాటు, నిర్వహణ, మెయింటెనెన్స్ బాధ్యతలను టెండర్ ద్వారా ఎంపిక చేసిన ప్రైవేట్ ఆపరేటర్లకు మూడేళ్ల కాలపరిమితితో అప్పగించనున్నారు.
టికెట్ ధరల వివరాలు (ప్రతిపాదిత):
ఈ సరికొత్త రైడ్స్ కోసం హెచ్ఎండీఏ ప్రాథమికంగా టికెట్ ధరలను కూడా ప్రతిపాదించింది. పెద్దల కోసం ఏర్పాటు చేసే బంగీ ట్రాంపోలిన్కు ఒక్కొక్కరికి రూ. 60, పిల్లల కిడ్స్ ట్రాంపోలిన్కు రూ. 40 గా ధరలను నిర్ణయించారు. అయితే, ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆపరేటర్లు రెండో సంవత్సరం నుండి టికెట్ ధరలను పెంచాలనుకుంటే, ఏడాదికి గరిష్టంగా 10 శాతం వరకు మాత్రమే పెంచేందుకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
