భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ అందరివాడని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో..ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదన్నారు. గాంధీ, నెహ్రూలకు ఏ మాత్రం తీసిపోని దార్శనికుడని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తెలిపిన కేటీఆర్.. తెలంగాణ సాధనలో అంబేద్కర్ విధానాలతోనే KCR వెళ్లారని చెప్పారు.
తెలంగాణ భవన్లో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాసనసభ అనుమతి..శాసనసభ అప్రూవల్..అవసరం లేకుండానే భారత ప్రభుత్వం పార్లమెంట్లో నేరుగా బిల్లు పెట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని అనే అంశాన్ని పొందుపర్చడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీరామ రక్ష అయ్యిందన్నారు.
ఉమ్మడి ఏపీ శాసనసభలో ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందేన్నారు. అంబేద్కర్ తత్వం భారతదేశానికి అవసరం ఉందని..ఆయన రచించిన రాజ్యంగానికి గౌరవిస్తూ..అల్పాసంఖ్యాకులకు ప్రభుత్వాలు అండగా..రక్షణగా నిలిచి..వారి హక్కులను నిలబెట్టిన నాడే అంబేద్కర్కు నిజమైన నివాళి అని కేటీఆర్ వెల్లడించారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ వివాదంపై ఆయన స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.