సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు సామాజికవేత్త దేవి. గతంలో ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. వారితోపాటు కొత్తవారు ఫిర్యాదు చేయాలంటే కమిటీ పారదర్శకంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే.. బాధితుల తరపున తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతించారు మహిళా సంఘం నేత సంధ్య. సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. పోరాట ఫలితంగా వచ్చిన జీవోను వెల్కం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ కంటితుడుపు చర్యలకు పరిమితం కాకుండా.. బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలని డిమాండ్ చేశారు.
టాలీవుడ్లో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై 2019, ఏప్రిల్ 18వ తేదీ గురువారం టి.సర్కార్ స్పందించింది. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 984 విడుదల చేసింది. ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.