×
Ad

సీపీఐ నేతలకు కేకే ఫోన్ : మద్దతు ఉపసంహరించవద్దు

  • Published On : October 14, 2019 / 01:06 PM IST

సీపీఐ నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఫోన్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉపసంహరణ వంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన సూచించారు. అక్టోబర్ 14 సోమవారం మగ్దూం భవన్‌లో సీపీఐ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ ముఖ్య నేతలు చాడ వెంకట్ రెడ్డితో పాటు జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఎంపీ కేకే ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ సమ్మె అంశంలో మధ్యవర్తిత్వం వహించేలా చొరవ తీసుకోవాలన్నారు. దీంతో మద్దతు ఇవ్వాలా ? ఉపసంహరించుకోవాలా అనే దానిపై కౌన్సిల్‌లో తర్జనభర్జనలు పడుతున్నారు. ఆర్టీసీలో AITUC, ఎంప్లాయిస్ యూనియన్లు బలంగా ఉండడంతో సీపీఐ చొరవ తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. 

హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఐ..ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ఆత్మపరిశీనలో పడిపోయింది. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే విషయంలో పునరాలోచనలో పడిపోయింది. కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండాలని..లేనిపక్షంలో పార్టీపై విమర్శలు చెలరేగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు.  హుజూర్ నగర్ ఎన్నికల్లో మద్దతు రాజకీయ అవసరం అని ముందుగా పేర్కొన్నా…ఇప్పుడు మాత్రం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీపీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. 
Read More : కేకే మధ్యవర్తిత్వం : పరిష్కారం దిశగా ఆర్టీసీ స్ట్రైక్!