ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ.. కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 39వ రోజుకు చేరింది. అయినా.. ఇప్పటివరకు ప్రభుత్వం గానీ.. కార్మిక సంఘాలు గానీ వెనక్కి తగ్గడం లేదు. హైకోర్టు కూడా చర్చలతో సమస్య పరిష్కారం చేసుకోవాలని సమయమిచ్చినా.. న్యాయస్థానం ఆదేశాలను పక్కనబెట్టేశారు. దీంతో.. కార్మికుల సమ్మెపై హైకోర్టులో కొన్నాళ్లుగా వాదనలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో దాఖలవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై.. కోర్టు కూడా విచారిస్తూ వస్తోంది. ప్రభుత్వ వాదనలపై.. కోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలా.. ఆర్టీసీ సమ్మె విషయంలో.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె, 5100 రూట్ల ప్రైవేటీకరణపై.. కోర్టులో విచారణ జరుగనుంది.
సమ్మెపై చర్చించేందుకు.. ప్రభుత్వానికి, ఆర్టీసీ యజమాన్యానికి, కార్మిక సంఘాలకు సమయమిచ్చినా.. ఎలాంటి పరిష్కారం దొరకలేదని హైకోర్టు చెప్పింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించలేమని.. చర్చలు జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. చర్చల కోసం ఆదేశాలు జారీచేసే అధికారం తమకులేదని తెలిపింది. సమ్మెను చట్టవిరుద్ధమా.. కాదా.. అని తేల్చే అధికారం లేబర్కోర్టుకే ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇందుకు.. హైకోర్టు సరైన ఫోరం కాదని స్పష్టం చేసింది. ఇక.. తమ ఎదుట ఉన్న పిటిషన్లను మెరిట్ ప్రకారం విచారించి ఆదేశాలిస్తామని తెలిపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, 5,100 రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయం, కొత్త అద్దె బస్సుల కోసం టెండర్ల ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై.. హైకోర్టు విచారణ చేపట్టనుంది.
అదే విధంగా.. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై విధించిన స్టేను కూడా కోర్టు పొడిగించింది. ఆర్టీసీ ఎస్మా పరిధిలో లేదని.. ఇంకా ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోనే ఉందని కోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల.. ఎస్మా కింద ఎలాంటి ఆదేశాలివ్వలేమని తెలిపింది. ఆర్టీసీ అత్యవసర సేవ అని జీవో జారీ చేస్తేనే.. ఎస్మా కిందకు వస్తుందని కోర్టు చెప్పింది. అలా.. జీవో లేనందున.. ఆర్టీసీ ఎస్మా కిందని రాదని స్పష్టం చేసింది.
తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు, కార్మికుల సమస్యలను వివరించేందుకు.. ఆర్టీసీ జేఎసీ నేతలు ఇవాళ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున.. ఇవాళ్టి నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కోర్టు తీర్పు తర్వాతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు జేఏసీ నేతలు.