హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 10న (శుక్రవారం) ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో ఒక్క ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్–179, కాంగ్రెస్–177, బీజేపీ–148, టీడీపీ–60, సీపీఐ–20, సీపీఎం–19, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–40, ఇండిపెండెంట్ అభ్యర్థులు–162 మంది బరిలో నిలిచారు.
ఎంపీటీసీ స్థానాల విషయాని కొస్తే టీఆర్ఎస్–1,848, కాంగ్రెస్–1,698, బీజేపీ–895, టీడీపీ–173, సీపీఐ–87, సీపీఎం–92, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు, రాష్ట్రంలో ఎస్ఈసీ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు–101, ఇండిపెండెంట్ అభ్యర్థులు–1,249 మంది పోటీలో ఉన్నారు.