Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నారని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే చెప్పారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం రేపు బలపరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉండగా ఇవాళ ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి రాజేంద్ర షింగ్నే మీడియాతో మాట్లాడారు.
Maharashtra: రేపు బలపరీక్ష.. నేడు కీలక నిర్ణయాలు తీసుకున్న మహారాష్ట్ర కేబినెట్
”సమావేశం చివరలో మూడు నిమిషాల పాటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పలు విషయాలపై మాట్లాడారు. మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు అందరూ తనకు సహకరించారని అన్నారు. ఇంతకు ముందు తనకు పరిపాలనా అనుభవం లేదని ఆయన చెప్పారు. ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని అన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష, సీఎం రాజీనామా అంశాలు సమావేశంలో చర్చకు రాలేదు” అని ఆయన చెప్పారు. కాగా, కేబినెట్ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగభరితంగా మాట్లాడారని, ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర షింగ్నే దీనిపై స్పందించారు.