Syria Boat Capsize : వాళ్లంతా వలసదారులు. బతుకుదెరువు కోసం సొంతూరు వదిలి వలస వెళ్తున్నారు. కానీ, గమ్యం చేరే లోపే ఘోరం జరిగిపోయింది. వారు జల సమాధి అయ్యారు. సిరియా తీరంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం సిరియా వలసపోతున్న వారి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.
లెబనాన్.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడ ఉపాధి కరువైంది. బతుకు భారంగా మారింది. దీంతో లెబనాన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఓ పడవలో సిరియాకు సముద్ర మార్గంలో అక్రమంగా బయల్దేరారు. అయితే, వారి పడవ సిరియా తీరానికి చేరువలోకి రాగానే మునిగిపోయింది. ఈ ఘటనలో 77 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవ వలసదారులతో కిక్కిరిసిపోయి ఉంది. పడవలో దాదాపు 150 మందికి పైగా ఉన్నట్టు భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న సిరియా అధికారులు 20 మంది వలసదారులను కాపాడారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పడవలో సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని ఎక్కించడంతో ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.