Biden Emotional : అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్లోని ఎలిమెంటరీ స్కూల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 18మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలో శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
దేవుడి పేరుతో గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్హౌజ్ నుంచి బైడెన్ ప్రసంగించారు. తీవ్ర విచారకరమైన ఈ పరిస్థితిని ప్రతి తల్లిదండ్రులకు, దేశంలోని ప్రతి పౌరునికి ఒక చర్యగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో ఎన్నికైన ప్రతి అధికారికి(సెనేటర్లను ఉద్దేశిస్తూ) మనం స్పష్టంగా తెలియజేయాలన్నారు. చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను బైడెన్ గుర్తు చేసుకున్నారు. 1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్ భార్య, కూతురు చనిపోయారు. 2015లో బైడెన్ కొడుకు కేన్సర్తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరమైతే కలిగే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు. అది వాళ్ల గుండెకు మాయని గాయమని తెలిపారు. తానైతే కొంతకాలం తీవ్రమైన క్షోభను అనుభవించానంటూ బైడెన్ చెప్పుకొచ్చారు.
గన్ కల్చర్ కట్టడికి ‘ఘోస్ట్ గన్స్’ చట్టం తీసుకొచ్చింది బైడెన్ ప్రభుత్వం. అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అక్రమ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం అమలు చేయడం సాధ్యపడటం లేదని బైడెన్ ప్రభుత్వం అంటోంది. మరోవైపు.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారీస్ కూడా టెక్సస్ కాల్పుల ఘటనపై స్పందించారు. ఇలాంటి ఘటనలు ఇక చాలన్నారు. ఇంతటితో ఆపాల్సిన అవసరం ఉందన్నారు. దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హ్యారీస్ అన్నారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయని, చర్యలు తీసుకోవడానికే ధైర్యం చేయాలని కమలా హ్యారీస్ వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసు అధికారులు హతమార్చినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు.
Read Also : Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి