Justin Trudeau: ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా అడ్డాగా మారిపోయింది. స్వదేశానికి వ్యతిరేకంగా పరాయి దేశంలో నిరసనలు, ర్యాలీలు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీని హత్య చేస్తున్నట్లు తయారు చేసిన శకటాలతో ర్యాలీ తీశారు. ఇలాంటివి తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరింది. అయితే ఇంత జరుగుతున్నా భారత్నే తప్పు పడుతున్నారు ఆ దేశ ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో.
కెనడాలో సిక్కుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల కాబోలు.. ఖలిస్తానీలకే మద్దతిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కెనడాలో భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, అయితే హింసకు తావివ్వమని అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరితో మాట్లాడారు. ఖలిస్తాన్ అనుకూలవాదులు ఓటు బ్యాంకులో ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి తీవ్రవాదం పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించగా ‘‘ఆ విధంగా భావించేవారిది పూర్తిగా తప్పుడు ఆలోచన. ఉగ్రవాదం, హింస పట్ల కెనడా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది. హింస, హింసకు సంబంధించిన ముప్పులపై కెనడా ఎల్లప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుంది’’ అని అన్నారు.
Bandi Sanjay: హైదరాబాద్ చేరుకున్నాక కిషన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నాం. ఇకపై కూడా అలాగే చేస్తాం. విభిన్న సంస్కృతులవారికి మా దేశం స్వాగతం పలుకుతుంది. మేము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తాం. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశం. హింస, తీవ్రవాదాలు ఏ రూపంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
కెనడాలోని భారతీయ మూలాలున్న వారికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ అనుకూల సంస్థలు పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నాయి. దీంతో భారతీయ మూలాలుగలవారిలో భయాందోళన, అశాంతి పెరుగుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరోవైపు సిక్కు వేర్పాటువాదులు రాడికలైజ్ అవడం పెరుగుతోందని కెనడియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసే ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ కెనడా నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం.