చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ రిసార్ట్లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అయితే వీరి చర్చల్లో కశ్మీర్ అంశం ప్రస్తావనకు రాలేదని అధికారవర్గాలు తెలిపాయి. చైనా పర్యటనకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీని జిన్పింగ్ ఆహ్వానించారు.
గత 2 వేల ఏళ్ల నుంచి భారత్, చైనాలు ఆర్థిక శక్తులుగా ఉన్నాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు. మళ్లీ ఇపుడు రెండు దేశాలు ఆ దిశగా ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు. చెన్నై సమావేశంతో భారత్-చైనాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందన్నారు మోడీ. గతేడాది వూహన్ సమ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇవ్వగా…. చెన్నై విజన్తో కొత్త శకం ఆరంభమైందన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను వివాదం చేయదలచుకోలేదన్న మోడీ… ప్రపంచంలో శాంతి, స్థిరత్వం కోసం మన వంతు సహకారం అందిద్దామని చెప్పుకొచ్చారు.
భారత పర్యటన తనకు మధుర అనుభూతులను మిగిల్చిందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. ఈ పర్యటన ఎప్పటికీ మరువలేనని…. మోడీ ఆతిథ్యం మైమరచిపోయేలా చేసిందన్నారు. మా ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని జిన్పింగ్ కొనియాడారు. ఈ చర్చల అనంతరం కోవలం రిసార్ట్లో ఏర్పాటు చేసిన చేనేత వస్తువులు, కళాఖండాల ప్రదర్శనను మోడీ, జిన్పింగ్ సందర్శించారు. విందు భేటీలో మరోసారి చర్చలు జరిపిన అనంతరం జిన్పింగ్ నేపాల్కు తిరుగు పయనమయ్యారు.