Human Kidney In Pig Embryo
Human Kidney In Pig Embryo : అవయవ మార్పిడి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి పరిశోధకులు శుభవార్త అందించారు. చైనాలోని గ్వాంగ్జౌ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అద్భుతం సృష్టించారు. పంది పిండంలో మానవ మూత్ర పిండాన్ని అభివృద్ధి చేశారు. గ్వాంగ్జౌ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోమెడిసిన్ అండ్ హెల్త్ కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి సఫలమయ్యారు.
పంది కణాలు, మానవ కణాల కలయికతో చేసిన ఈ మూత్ర పిండం 28 రోజుల తర్వాత మానవ మూత్ర పిండంగా రూపాంతరం చెందినట్లు పరిశోధనలకు నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ లై లియాంగ్వు పేర్కొన్నారు. పరిశోధన ఫలితాలు జర్నల్ సెల్ స్టెమ్ సెల్ లో ప్రచురితం అయ్యాయి. మానవ అవయవాల మార్పిడికి డిమాండ్ అధికమవ్వడంతో ఇతర జీవుల ద్వారా అవయవాల అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు.
దీంతో గ్వాంగ్జౌ పరిశోధకులు కూడా దీనిపై దృష్టి సారించారు. పరిశోధనల్లో భాగంగా 1820 పంది పిండాలను సేకరించిన శాస్త్రవేత్తలు వాటిలో నుంచి ల్యాబ్ లో 13 పంది పిండాలను ఎంచుకున్నారు. వాటిలో మానవ ఫ్లురిపోటెంట్ కణాలను ప్రవేశపెట్టారు. మానవ అవయవాల తరహాలో రూపాంతరం చెందే గుణం ఉన్న ఈ కణాలకు రసాయనాల మిశ్రమం కలిపి మూత్రపిండాలను అభివృద్ధి చేశారు.
28 రోజుల అనంతరం చూడగా పంది పిండంలో మానవ మూత్రపిండం కనపించింది. ఈ మూత్రపిండాల్లో 60 శాతం మానవ కణాలు, 40 పంది కణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే మానవ కణాలు ఉండటం వల్ల ఈ మూత్రపిండాన్ని పంది రోగ నిరోధక వ్యవస్థ నిరాకరిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపితే అవయవ కొరత తీరే అవకాశం ఉందని తెలిపారు.