Bogota Mayor : వాతావరణ మార్పుల కారణంగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా నీటి ఎద్దడి నెలకొంటుంది. ఇప్పటికే మన దేశంలోని బెంగళూరు నగరంలోని ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గార్డెనింగ్ కోసం నీరు వాడినా, కార్లు కడిగినా జరిమానాలను విధిస్తున్నారు అధికారులు. వేసవి కాలం సమీపిస్తుండడంతో ఇంకా చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు ప్రారంభం అవుతున్నాయి. మనదేశంలో మాత్రమే కాదు కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు నీటి కష్టాలు మొదలు అయ్యాయి.
రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి రిజర్వాయర్ల నీటి మట్టాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో బొగోటా మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ నీటిని పొదుపు చేసేందుకు పలు సూచనలు చేశారు. దంపతులు కలిసి స్నానం చేయాలని సూచించాడు. ఫలితంగా నీరు ఎక్కువగా ఆదా అవుతుందన్నారు. అంతేకాదండోయ్.. ఆదివారం లేదా వారంలో మరేదైనా రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోతే ఆ రోజు స్నానం చేయడం మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నీటి ఎద్దడి నేపథ్యంలో ఒక్క బొట్టు నీటిని వృథా చేయొద్దనీ, ఇలాంటి జాగ్రత్తలను ఇంకా ఎన్నో తీసుకోవాలని ఆయన తెలిపారు.
బొగోటా మేయర్ ఫెర్నండో గలాన్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. ఆయన చేసిన సూచనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన్ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఇవేం సూచనలు అని అంటున్నారు.
ఎల్నినో కారణంగా 2023లో వాతావరణంలో మార్పులు రావడంతో వర్షాలు పెద్దగా పడలేదు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రిజర్వాయర్లలో నీరు పెద్ద మొత్తంలో ఆవిరి కావడంతో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఈ ఎల్నినో ప్రభావం బొగోటా పై కూడా పడింది. బొగొటా నీటి అవసరాలను 70 శాతానికి పైగా తీర్చే చింగాజా నీటి వ్యవస్థకు ప్రాణాధారమైన మూడు రిజర్వాయర్లలో కేవలం 16.9 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి.