Drone Over Indian Embassy : పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం (Indian Embassy) వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డ్రోన్లతో భద్రతా ఉల్లంఘన పాల్పడిన పాకిస్థాన్పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు తెలిపాయి. గత వారమే జమ్మూ కశ్మీర్లోని వైమానిక దళంపై డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడితో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయం (Indian High Commission) పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కనిపించడం మరోసారి కలకలం రేపింది. గత ఆదివారం భారత వైమానిక దళ స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో ఉపయోగించిన టెక్నాలజీకి అక్కడి రాష్ట్ర-మద్దతుతో పాటు పాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబాల హస్తం ఉందనే శ్రీనగర్లోని 15 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పాండే తెలిపారు.
జూన్ 26వ భారతీయ ఎంబసీ వద్ద రెసిడెన్షియల్ ప్రాంతంలో డ్రోన్ కనిపించినట్లు తెలిసింది. అదే రోజున జమ్మూలోని ఎయిర్బేస్పై డ్రోన్ దాడి జరిగింది. అనంతరం సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్లను భద్రతా దళాలు గుర్తించాయి. పాక్ ఉగ్రవాదులు డ్రోన్లు వాడకంపై ఐక్యరాజ్యసమితిలో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.