Iran says US move to ease internet sanctions is part of its hostile stance
Hijab Row: ఇరాన్పై అమెరికా అనేక ఆంక్షల్ని విధించింది. ఇందులో ఇంటర్నెట్ సేవల కట్టడీ ఒకటి. అయితే తాజాగా ఇరాన్లో హిజాబ్ వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో ఇరానీ మహిళల గొంతును ప్రపంచానికి వినిపించడం కోసం ఇంటర్నెట్పై విధించిన ఆంక్షల్ని అమెరికా సడలించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇరాన్ మహిళల నిరసనలు ప్రపంచానికి ఎక్కువగా తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, ఆంక్షల్ని విధించడంపై అమెరికాను తప్పు పట్టే ఇరాన్.. తాజాగా ఆంక్షల్ని సడలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఆదివారం ఇరాన్ మీడియాతో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి నస్సేర్ కనాని మాట్లాడుతూ ‘‘ఇంటర్నెట్ సేవల్ని సులభతరం చేసి, ఆంక్షల్ని సడలించి ఏదో గొప్ప కార్యం చేశామని వాషింగ్టన్ (అమెరికా రాజకీయ రాజధాని) ప్రచారం చేస్తుండవచ్చు. కానీ ఇరాన్ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఈ విషయంలో మరింత అడ్వాంటేజి తీసుకుని ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరు స్పష్టమవుతూనే ఉంది’’ అని అన్నారు.
ఇక ఇరాన్లో హిజాబ్ వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా 80 ప్రధాన పట్టణాలు, నగరాలకు చేరాయి. హిజాబ్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు మరింత వ్యాపించకుండా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది. నిరసనకారులపై భద్రతా బలగాలు చేసిన దాడులలో ఇప్పటివరకు 50 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశ మానవహక్కుల సంఘం తెలిపింది. ప్రభుత్వ అధికారిక లెక్కల కంటే మూడు రెట్లు ఎక్కువగా మరణించారని పేర్కొంది.
Punjab: సీఎంను కలుసుకున్నాక మనసు మార్చుకున్న గవర్నర్.. అసెంబ్లీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్