Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్యకు భారీ ఊరట.. ఏకాంత నిర్బంధం నుంచి విముక్తి
Imran Khan : ఇస్లామాబాద్ హైకోర్టు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలకు ఊరట కలిగేలా తీర్పును ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- September 1, 2026 / 06:47 PM IST
Imran Khan and his wife Bushra Bibi
Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీలు అవినీతి ఆరోపణలు సహా పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు రావల్పిండిలోని ఆడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నాడు. ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అనుమతి లేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఓ ప్రైయివేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాజాగా.. హైకోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట కల్పిస్తూ తీర్పునిచ్చింది.
Also Read : Nepal Floods: నేపాల్ కు మళ్ళీ ముప్పు.. భోటికోసి నదికి వరద ఉధృతి.. చైనా నుంచి రెడ్ అలర్ట్
పాకిస్థాన్ తెహ్రిక్ -ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని పేర్కొంటూ ఆయన సోదరి అలీమా ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటీషన్ వేసింది. బుష్రా బీబీ తరపున ఆమె కుమార్తె ముబషరా ఖవార్ మనేకా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు ఊరటనిస్తూ తీర్పునిచ్చింది. ఇకపై వారిని ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రావల్పిండిలోని అదియాలా జైలు అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది
జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ను ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ మధ్య సమావేశం జరిగేలా జైలు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది.
ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించడంతో పాటు జైలు నిబంధనల ప్రకారం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యతను అదియాలా జైలు సూపరింటెండెంట్కు అప్పగించింది. ఆదేశాలు అమలు చేసిన తీరుపై 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
