Contaminated Drink : దారుణ ఘటన.. కలుషిత పానీయం తాగి 48మంది మృతి.. 100మందికి తీవ్ర అస్వస్థత..
Contaminated Drink In Nigeria : నైజీరియాలో మిథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పానీయం తాగిన ఘటనలో 48మంది ప్రాణాలు కోల్పోయారు.
Contaminated Drink In Nigeria
Contaminated Drink In Nigeria : నైజీరియాలో మిథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పానీయం తాగిన ఘటనలో 48మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా అస్వస్థతకుగురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దక్షిణ నైజీరియాలోని ఒండో రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బాంజీ అజాకా తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిగ్బో, ఇరెలె స్థానిక ప్రభుత్వ ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో మొత్తం 182 మంది ప్రభావితమైనట్లు అధికారులు భావిస్తున్నారు. పానీయం తీసుకున్న తర్వాత, అది ఎంత పరిమాణంలో తీసుకున్నారనే దానిపై ప్రభావం ఆధారపడి ఉంటుంది. కిడ్నీలు పనిచేయడం ఆగిపోవచ్చు, కంటి చూపు దెబ్బతినవచ్చు, మెదడు కూడా తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అజాకా తెలిపారు.
అయితే, అనారోగ్యానికి గురైన వారిలో కొందరు చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసినట్లు ఒండో రాష్ట్ర పోలీసు ప్రతినిధి అబయోమి జిమోహ్ తెలిపారు. అరెస్టైన వారిలో ఒక వ్యక్తి మిథనాల్ ఉన్నట్లు అనుమానిస్తున్న పానీయాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ప్రస్తుతం అతడు పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నాడని వెల్లడించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటనలో తొలి మరణం దాదాపు రెండు వారాల క్రితమే నమోదైంది. అనంతరం వరుసగా అనారోగ్య కేసులు, మరణాలు వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పానీయంలో నిజంగా మిథనాల్ ఉందా? దాన్ని ఎవరు తయారు చేశారు? అనే అంశాలపై వేగంగా దర్యాప్తు కొనసాగుతోంది.
