ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి వందలాది గాడిదలను ఎందుకు దొంగిలిస్తోంది..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..! ఫ్రాన్స్, బెల్జియం కూడా..
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని గాడిదలను అక్రమంగా తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇజ్రాయెల్ బాంబుల దాడికి పాల్పడిన ప్రాంతాల్లో ...
- Harishth Thanniru
- Published On : July 18, 2025 / 02:32 PM IST
donkeys
Israeli army stealing hundreds of donkeys from Gaza: ఇజ్రాయెల్ సైన్యం గాజా నుండి వందలాది గాడిదలను దొంగిలించిందని, యాజమానుల అనుమతి తీసుకోకుండా వాటిని ఇజ్రాయెల్తోపాటు ఫ్రాన్స్, బెల్జియంలోని జంతు ఆశ్రయాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యం, చికిత్స పేరుతో ఈ గాడిదలను ఇజ్రాయెల్ సైన్యం తరలిస్తుందట. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇజ్రాయెల్ గాజాలోని గాడిదలను ఎందుకు వేరే దేశాలకు తరలిస్తుంది..? నిజంగా వాటికి వైద్య సదుపాయాలు అందించేందుకేనా..? ఫ్రాన్స్, బెల్జియంలకు ఎందుకు రవాణా చేస్తుంది.. అనే అంశాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని గాడిదలను అక్రమంగా తరలించడం వెనుక పెద్ద కారణమే ఉందట. ఇజ్రాయెల్ బాంబుల దాడికి పాల్పడిన ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇంధన కొరత ఏర్పడింది. వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి.. దీంతో పాలస్తీనియన్లకు ముఖ్యమైన రవాణా మార్గంగా గాడిదలు మారాయి. వస్తువులను రవాణా కోసం, తాత్కాలిక అంబులెన్సుల కోసం కూడా గాడిదలను ఉపయోగిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలు గాడిదలను బంగారం కంటే విలువైనది భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ మీడియా కాన్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ సంస్థలతోపాటు యూరోపియన్ సంస్థలు కూడా గాజా నుండి గాడిదలను అక్రమంగా తరలిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రెంచ్, బెల్జియన్ సంస్థలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైనికులు గాజాలోని వారు దాడిచేసే ప్రాంతాల నుండి గాడిదలను తరలిస్తున్నారని నివేదిక పేర్కొంది. అనారోగ్యం, చికిత్స పేరుతో ఈ గాడిదలను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్తున్నారట.
ఈ గాడిదలను ముందుగా టెల్ అవీవ్కు దక్షిణంగా ఉన్న మోషాన్ హరోట్ కు తీసుకెళ్తున్నట్లు కాన్ నివేదిక పేర్కొంది. మే18న ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి 58 గాడిదలను బెల్జియంకు తరలించి, అక్కడి నుంచి ఫ్రాన్స్, బెల్జియంలోని ఆశ్రయ గృహాలకు తరలించారని నివేదికలు చెబుతున్నాయి. చికిత్స కోసం గాడిదలను బయటకు తరలిస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతుండగా.. పాలస్తీనియన్లు మాత్రం.. దొంగతనంగా అభివర్ణిస్తున్నారు. స్థానికంగా మానవతా సంక్షోభం సృష్టించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు.
గాజాలో పరిస్థితిని భయంకరమైనదిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ అభివర్ణించారు. గాజాలో ఇంధన కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. తగినంత ఇంధనం లేకపోవడంతో వారు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని, గాజాలోని అన్ని ముఖ్యమైన సేవలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అన్నారు. ఆరోగ్య సేవలు, స్వచ్ఛమైన నీరు, సహాయం అందించే సామర్థ్యం లేకుండాపోతుంది.. తద్వారా ఎక్కువ మరణాలు సంభవించేందుకు కారణమవుతుందని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు హెచ్చరించాయి.
