Israel Palestine Conflict : ఇజ్రాయెల్లో ఆగని విధ్వంసం.. యుద్ధం తప్పదా?
పవిత్ర రంజాన్ పండుగ రోజు కూడా పాలస్తీనా, ఇజ్రాయిల్లలో రక్తం చిందింది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్ సైన్యం మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
- Sreehari A
- Published On : May 15, 2021 / 08:42 AM IST
Israel Palestine Conflict Updates
Israel-Palestine conflict updates : పవిత్ర రంజాన్ పండుగ రోజు కూడా పాలస్తీనా, ఇజ్రాయిల్లలో రక్తం చిందింది. పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్ సైన్యం మధ్య పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ 9 వేల మంది రిజర్వుడు సైనికులను రంగంలోకి దింపింది. సైన్యంతో పాటు ఇజ్రాయిల్కి చెందిన అధునాతన యుద్ధట్యాంకులు కూడా ఈ సమరంలో భాగమయ్యాయి.
ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని… సరైన సమయంలో దాడులకు సిద్ధంగా ఉన్నామంటూ ఆర్మీ అధికారులు ప్రకటించారు. దశాబ్దాల తరబడి ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నప్పటికీ … ఎప్పుడూ లేనంతగా హమాస్ ఉగ్రవాదుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది ఇజ్రాయిల్. మరోవైపు లెబనాన్ నుంచి హెజ్బుల్లా మిలిటెంట్లు సైతం ఇజ్రాయిల్పై దాడులకు పాల్పడుతున్నారు.
హెజ్బుల్లా తీవ్రవాదులు ప్రయోగించిన మూడు రాకెట్లు ఇజ్రాయిల్ ఉత్తర దిక్కున మధ్యధర సముద్రంలో పేలాయి. దీంతో ఒకేసారి రెండు తీవ్రవాద సంస్థలతో పోరాటం చేయాల్సిన స్థితిలో ఉంది ఇజ్రాయిల్. ఇక తమ దేశంపై దాడి చేసినందుకు హమాస్ ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు. హమాస్పై దాడులు కొనసాగిస్తున్నామని, అవసరమైతే దాడుల తీవ్రతను ఇంకా పెంచుతామన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సంధి కుదుర్చేందుకు ఈజిప్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు రెండు దేశాల గొడవల్లో చనిపోయిన కేరళకు చెందిన సౌమ్య మృతదేహాం ఇవాళ ఆమె స్వస్థలానికి చేరుకోనుంది.
