India-China: సరిహద్దుల వద్ద చైనా పాల్పడుతున్న చర్యలపై రాజ్యసభలో ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. అలాగే, భారత విదేశాంగ విధానం విషయంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా ఏకపక్షంగా ఏదైనా చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని చెప్పారు.
ఒకవేళ సరిహద్దుల వద్ద చైనా తన సైనిక శక్తిని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తే భారత్-చైనా మధ్య తీవ్ర ప్రభావం పడుతుందని, ఇరు దేశాల సత్సంబంధాల విషయంలోనూ ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. దౌత్యపరంగా ఆయా విషయాలపై తాము పూర్తిగా స్పష్టతతో ఉన్నామని తెలిపారు. ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ సాయాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.
కాగా, భారత గణతంత్ర్య దినోత్సవానికి జనవరి 26న అతిథిగా హాజరయ్యేందుకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అంగీకరించారని జైశంకర్ పార్లమెంటుకు తెలిపారు. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుండడంతో వస్తున్న విమర్శలపై జై శంకర్ స్పందించారు.
భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తాము ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల ఎనర్జీ మార్కెట్ స్థిరత్వంపై ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ‘‘రష్యా నుంచి ఇంధనం కొనాలని మేము మా సంస్థలకు చెప్పం. ఎక్కడి నుంచి మంచి అవకాశాలు ఉన్నాయో ఆ దేశం నుంచే కొనుగోలు చేయాలని చెబుతాం’’ అని జైశంకర్ చెప్పారు.
MCD Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచింది.. కానీ సినిమా ఇంకా మిగిలే ఉంది