Jupiter closest to Earth: నేడు భూమికి దగ్గరగా రానున్న గురు గ్రహం.. మళ్లీ 107 సంవత్సరాల తర్వాతే.. అందరూ చూడొచ్చంటున్న సైంటిస్టులు
జూపిటర్ గ్రహం నేడు భూమికి అతి దగ్గరగా రానుంది. అర్ధరాత్రి 01.30 గంటలకు జూపిటర్ భూమి సమీపంలోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోజు తర్వాత తిరిగి భూమి సమీపంలోకి రావడానికి మళ్లీ 107 సంవత్సరాలు పడుతుంది.
- Narender Thiru
- Published On : September 26, 2022 / 12:47 PM IST
Jupiter closest to Earth: సౌర వ్యవస్థలోని పెద్ద గ్రహమైన గురు గ్రహం (జూపిటర్) నేడు భూమికి అతి దగ్గరగా రానుంది. ఈ రోజు రాత్రి భూమికి అత్యంత సమీపంలోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 59 సంవత్సరాల తర్వాత జూపిటర్ ఇలా భూమికి అత్యంత సమీపంలోకి రానుంది.
Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు
సోమవారం రాత్రి జూపిటర్ దాదాపు 59,06,29,248 కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ గ్రహం మనకు 96,56,06,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ, ఈ రోజు 40 శాతంపైగా దగ్గరగా రానుంది. చివరగా జూపిటర్ భూమికి దగ్గరగా వచ్చింది 1963లో. ఇవాళ్టి తర్వాత మళ్లీ భూమికి దగ్గరగా రావడానికి 107 సంవత్సరాలు పడుతుంది. అంటే గురు గ్రహం ఇంత దగ్గరగా వచ్చేది తిరిగి 2129లోనే. సౌర వ్యవస్థలో జూపిటర్ భూమికి ఎదురుగా రావడానికి 13 నెలలు ((399 రోజులు) పడుతుంది. ఈ గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి 11 సంవత్సరాల టైమ్ పడుతుంది. తన కక్ష్యలో సూర్యుడికి ఎదురుగా రావడానికి జూపిటర్కు ఇంత సమయం అవసరం.
ఈ రోజు రాత్రి 01.30 నిమిషాలకు అత్యంత దగ్గరగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జూపిటర్ను చాలా దగ్గరగా, ప్రకాశవంతంగా చూడొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణ కంటితోనే వీక్షించవచ్చని చెప్పారు. ఇది జీవిత కాలంలో ఒక్కసారే వచ్చే సందర్భమని, ఖగోళ అద్భుతాల్ని ఇష్టపడే వాళ్లు ఈ రోజు జూపిటర్ను చూసి ఆనందించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
