Kabul Airport : ప్రతికారం తీర్చుకుంటాం, వెంటాడి..వెంటాడి బదులు చెబుతాం
కాబూల్ దాడుల్లో.. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
- madhu
- Published On : August 27, 2021 / 07:18 AM IST
Us
President Biden : కాబూల్ దాడుల్లో.. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఐఎస్ఐఎస్-కే (ISIS-K) ఉగ్రవాదుల దాడుల్లో.. 12 మంది అమెరికా సైనికులు మృతిచెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తాము మరచిపోమని.. దారుణానికి కారణమైన వారిని క్షమించేది లేదన్నారు. వెంటాడి వేటాడి మరీ.. ఉగ్రవాదులకు కచ్చితంగా బదులు చెబుతామన్నారు బైడెన్. ఎంచుకున్న ప్రదేశంలో, ఎంపిక చేసిన సమయంలో.. కచ్చితంగా ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకుంటామని.. ISIS ఉగ్రవాదులు ఎప్పటికీ గెలవలేరన్నారు అమెరికా అధ్యక్షుడు.
Read More : Neeraj Chopra: బ్రేక్ కావాలి.. ఈ సంవత్సరం ఇక ఆడేది లేదు – నీరజ్ చోప్రా
తాలిబన్లు కైవసం చేసుకున్న అప్ఘాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిపై తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అష్టకష్టాలు పడుతున్న వారిపై ఉగ్రవాదులు సైతం రెచ్చిపోయారు. సురక్షితంగా వెళుదామని కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వందలాది మంది జనాల మధ్యలో పేలుళ్లు సంభవించాయి. ఎయిర్ పోర్టులో వరుసగా రెండు ఆత్మాహుతి దాడులు.. ఆ తర్వాత ఓ బాంబు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ పశ్చిమ గేటు దగ్గర నిన్న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదటి పేలుడు జరిగింది.
Read More : Kolkata Airport: ప్రమాదకర రేడియో ధార్మిక పదార్థం.. ఆ స్టోన్ అక్కడకెలా వచ్చింది?
బరోన్ హోటల్ దగ్గర రాత్రి 8 గంటల 3 నిమిషాలకు రెండో పేలుడు జరిగింది. జనం మధ్యలోకి వెళ్లి ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారు. దీంతో పక్కనున్న వారంతా తునాతునకలయ్యారు. ఆ రోడ్డంతా రక్తసిక్తమయింది. కాళ్లు, నడుం భాగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఎయిర్ పోర్ట్ దగ్గర పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఎటు చూసినా శవాలు కనిపిస్తున్నాయి. ఈ మారణహోమం తమ పనేనంటూ… ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ISIS-K ఒప్పుకుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
