×
Ad

Mumbai Terror Attack : పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు..26/11 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ కు 15 ఏళ్ల జైలుశిక్ష

పాకిస్థాన్‌ కోర్టు కనీవినీ ఎరుగని అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • Published On : June 25, 2022 / 10:34 AM IST

Mumbai Terror Attack Handler Jailed For 15 Years In Pakistan

Mumbai terror attack handler jailed for 15 years in Pakistan : పాకిస్థాన్‌ కోర్టు కనీవినీ ఎరుగని అత్యంత సంచలన తీర్పును వెలువరించింది. తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్‌ (నిర్వాహకుడు) కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంచలన తీర్పు గురించి లష్కరే తోయిబా..జమాత్ ఉద్ దవా నేతల టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులతో సంబంధించిన సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన 40 ఏళ్ల సాజిద్ మజీద్ మిర్‌కు జూన్ నెల ప్రారంభంలో లాహోర్‌లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది అని తెలిపారు.

ఇటువంటి కేసుల్లో నిందితుల నేరాన్ని మీడియాకు వెల్లడించే పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం (CTD) ఈ విషయంలో మాత్రం ఏ విషయాన్ని ప్రకటించలేదు. మీర్‌కు కోర్టు శిక్ష విధించిన విషయాన్ని వెల్లడించకపోవడం గమనించాల్సిన విషయం. అంతేకాదు..జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ క్రమంలో మీడియాను కూడా అనుమతించలేదు. 2022 ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన మిర్ ప్రస్తుతం కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడని న్యాయవాది తెలిపారు. మిర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రూ. 4 లక్షల జరిమానా కూడా విధించింది. కాగా..మిర్ చనిపోయాడని మొదట్లో అందరూ భావించారు. 26/11 ముంబై దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న మిర్ తలపై 5 మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించబడింది.

మిర్ 2005లో నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి భారత్‌కు వచ్చాడు. ముంబై దాడుల నేపథ్యంలో ఆయనను ‘ప్రాజెక్టు మేనేజర్’ అని పిలిచేవారు.అతను 2005లో నకిలీ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి భారతదేశాన్ని సందర్శించినట్లు సమాచారం. అంతకుముందు..అంటే జూన్ 14-17 మధ్య బెర్లిన్‌లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) ప్లీనరీ సమావేశంలో పాకిస్తాన్ అధికారులు సాజిద్ మీర్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేశారని..విచారణ తర్వాత ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారని పాశ్చాత్య మధ్యవర్తులకు తెలియజేసారు. కాగా.. ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ యాంటీ టెర్రర్ కోర్టు ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది.