Pm Modi-Benjamin Netanyahu
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరాన్పై తమ దేశం చేపట్టిన “ఆపరేషన్ రైజింగ్ లయన్” గురించి వివరించారు. ఈ అనూహ్య పరిణామంపై భారత్ తన స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. అసలు నెతన్యాహూ మోదీకి ఏం చెప్పారు? దీనిపై భారత్ ఎలా స్పందించింది? పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ ఫోన్ కాల్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా X (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. “ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్లో మాట్లాడాను. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ఆయన వివరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని, ఉద్రిక్తతలు వెంటనే తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు నేను తెలిపాను” అని మోదీ అన్నారు.
భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా సమతుల్యమైన వైఖరిని ప్రదర్శించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వం అత్యంత ప్రమాదకరమని, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అని భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఉద్రిక్తతలను పెంచే చర్యలకు పాల్పడవద్దని, సంయమనం పాటించాలని గట్టిగా సూచించింది. లాంటి సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికార యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలని కోరింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ ముందస్తు దాడులకు గల కారణాలను స్పష్టం చేసింది. ఇరాన్ అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చిందని, ఇది తమ దేశ భద్రతకు పెను ముప్పు అని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ప్రాణాంతక ముప్పును తొలగించేందుకే, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది.
ఈ ఆపరేషన్ గురించి నెతన్యాహూ మాట్లాడుతూ.. “ఇరాన్ ఇప్పటికే 9 అణుబాంబులకు సరిపడా యురేనియంను నిల్వ చేసింది. ఈ ముప్పును అంతం చేసేందుకే ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించాం. మా దేశ భద్రత కోసం ఇది అవసరం” అని సంచలన ప్రకటన చేశారు.
ఈ విషయంలో భారత్ పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ భారత్కు మిత్ర దేశాలే. ఒకవైపు ఇజ్రాయెల్తో రక్షణ, సాంకేతిక భాగస్వామ్యం ఉండగా, మరోవైపు ఇరాన్తో చారిత్రక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అందుకే భారత్ రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరుకుంటోంది.