30 ఏళ్లుగా ఉగ్రవాదులకు నిధులు.. సీక్రెట్ చెప్పేసిన పాక్ రక్షణమంత్రి.. ‘అమెరికా కోసమే చెత్త పనులన్నీ చేశాం‘
పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్థాన్ మారిందనేది స్పష్టమైంది.
- Harishth Thanniru
- Published On : April 25, 2025 / 01:11 PM IST
Pakistan Defence Minister Khwaja Asif
Pakistan: పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్థాన్ మారిందనేది ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. అయితే, మా గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ పాకిస్థాన్ ప్రగల్బాలు పలుకుతూ వస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ బండారం బయటపడింది. ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా పాక్ మారిందని తేటతెల్లం అయింది. ఈ విషయాన్ని ఒప్పుకుంది ఎవరోకాదు.. స్వయంగా.. పాకిస్థాన్ దేశ రక్షణ మంత్రే ఈ విషయాన్ని అంగీకరించారు.
పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారతదేశంలో నెలకొన్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ నీచ బుద్ధిని బయటపెట్టాయి. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్ట్ ప్రశ్నించగా.. మంత్రి అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం’’ అంటూ పేర్కొన్నాడు.
ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని అర్థమైంది. దాని వల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాకిస్థాన్ కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేది అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించాడు.
