Suleman Dawood : పాకిస్తాన్ బిలియనీర్ కొడుకు సులేమాన్ దావూద్కి టైటానిక్ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట.. తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు
తండ్రి కోసం 'టైటాన్' సాహస యాత్రకు ఒప్పుకున్నాడు. తండ్రితో పాటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. టైటాన్ సబ్ మెరైన్ జలసమాధి అయిన ఘటనలో పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ చనిపోయారు. నిజానికి సులేమాన్కి ఈ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట. తండ్రి కోసం వెళ్లి ఆయనతో పాటు తనువు చాలించాడు.
- Lakshmi 10tv
- Published On : June 23, 2023 / 03:43 PM IST
Suleman Dawood
Suleman Dawood : ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో కనిపించకుండా పోయిన సబ్ మెరైన్ ‘టైటాన్’ తీవ్ర విషాదాన్ని నింపింది. టైటాన్ కుప్పకూలినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సబ్ మెరైన్లో ప్రయాణించిన పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ కుమారుడు సులేమాన్ దావూద్కి ఈ యాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదట. తండ్రికోసం వెళ్లి అతనితోపాటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని అతని అత్త ఓ ప్రకటనలో తెలిపారు.
Titan Submersible: టైటాన్ సబ్మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?
సబ్ మెరైన్ ‘టైటాన్’ కుప్పకూలినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ ముగేర్ ప్రకటనలో తెలిపారు. సముద్రంలో 13,000 అడుగుల లోతున టైటానిక శకలాలకు 1500 అడుగుల దూరంలో టైటాన్ ఆనవాళ్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. సముద్ర ఒత్తిడిని తట్టుకోలేక టైటాన్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో టైటాన్లో ప్రయాణిస్తున్నవారంతా జలసమాధి అయ్యారు. అయితే పాక్లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్ ఎంగ్రో (Engro) సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న షహజాదా దావూద్ ఆయన కుమారుడు 19 సంవత్సరాల సులేమాన్ దావూద్కు అసలు ఈ సాహస యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట. ఈ విషయాన్ని అతని అత్త ఓ ప్రకటనలో తెలిపారు. వారి మరణాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సులేమాన్ ‘ఫాదర్స్ డే’ సందర్భంలో తండ్రి వెంట వెళ్లేందుకు అంగీకరించాడని ఆమె తెలిపారు.
తూర్పు కెనడాలోని న్యూఫౌండ్ ల్యాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉత్తర అట్లాంటిక్లోని టైటానిక్ శకలాల వద్దకు చేరుకునే సమయంలో టైటాన్ సబ్ మెరైన్ కనిపించకుండా పోయింది. కాగా తాజాగా అది జలసమాధి అయినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఇందులో ప్రయాణించిన వారంతా మృత్యువాత పడ్డారు.
