Extreme Heat : ఏటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే..?
ఇలా భూమి మండిపోడానికి గ్రీన్హౌస్ వాయువుల కారణం ఒక్కటే కాదు. మన జీవనశైలి కూడా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 22, 2023 / 06:33 PM IST
Summer
extreme heat – pollution : ఎండ వేడికి.. భూతాపం పెరిగిపోడానికి కాలుష్యం ప్రధాన కారణం. 2015 పారిస్లో జరిగిన కాప్ సదస్సు (COP21)లో భూతాపం తగ్గించాలని ప్రపంచ దేశాలన్నీ తీర్మానించుకున్నాయి. ఇది అతిపెద్ద దౌత్య విజయంగా అంతా అనుకున్నారు. కానీ, ఆచరణలో అన్ని దేశాలు విఫలమయ్యాయి. పారిస్ ఒప్పందం (Paris Areement) ప్రకారం పారిశ్రామిక విప్లవం కన్నా ముందు పరిస్థితులు పునరిద్ధరించాలని అనుకున్నారు. వాతావరణ మార్పుల (climate changes)ను స్థిరీకరించాలని కోరుకున్నారు. కానీ.. అవేవీ జరగలేదు. భూతాపం పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు (high temperature) ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి.
భూతాపాన్ని తగ్గించి.. వాతావరణం స్థిరీకరించాలని ప్రపంచ దేశాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. కానీ, ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి. కాలుష్యాన్ని అరికట్టలేక భూమిని నిప్పుల కొలిమిగా మార్చుతున్నాయి. 2023 నుంచి 2027 వరకు ఎండ వేడి బాగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో ప్రజారోగ్యం, ఆహార భద్రత, జలవనరులు, పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితులు మారాలంటే కాలుష్యం తగ్గించుకోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు నిపుణులు.
కాలుష్యంతో పెరిగిపోతున్న భూతాపం
1960 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 2015 తర్వాత వరుసగా ఎనిమిదేళ్లు అత్యంత హీటెస్ట్గా రికార్డు అయింది. వచ్చే ఐదేళ్లు అంతకు మించి వేడి ఉంటుందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువులుగా చెప్పే కార్బన్ డైయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్లు వాతావరణంలో ఎక్కువగా ఉండటంతో వేడి ఎక్కువగా ఉండటానికి కారణమని చెబుతున్నారు. ఏటా వాతావరణంలో ఈ వాయువుల ప్రభావం పెరిగిపోతుండటంతో భూమి మండిపోతోంది.
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ఏసీల వినియోగం
ఇలా భూమి మండిపోడానికి గ్రీన్హౌస్ వాయువుల కారణం ఒక్కటే కాదు. మన జీవనశైలి కూడా వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ వేడిని తట్టుకోడానికి మనం వాడే ఏసీలు.. వాతావరణంలో వేడిని మరింత ఎక్కువగా రగుల్చుతున్నాయి. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు విడుదల చేసే వాయువుల వల్ల కాలుష్యం బాగా పెరిగిపోతోంది. ఓ అధ్యయనం ప్రకారం దశాబ్ద కాలంగా ఏసీల వినియోగం చాలా ఎక్కువైంది. వచ్చే ఆరేడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ఏసీల వినియోగం పెరగనుందని చెబుతున్నారు. 2040 కల్లా ఇవి రెండింతలు పెరిగి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనాభాతోపాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే మన దేశంతోపాటు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో ఏసీల వినియోగం పెరుగుతోంది. ఇది అంతిమం సూర్యుడిని మరింతగా మండిస్తోంది.
Also Read: ఇవేం ఎండలు రా బాబూ.. మే నెల ముగిసినా ఎండలు తగ్గవట!
కాలుష్యం తగ్గించుకోవడం ఒక్కటే మార్గం
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. కాలుష్యం తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. ఏ వేడి నుంచి ఉపశమనానికి మనం ఏసీలు వాడుతున్నామో… ఆ ఏసీలే సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ఇక పరిశ్రమలు, వాహనాలు విడుదల చేసే వాయు కాలుష్యం అంతకు రెండింతలు అధికంగా ఉంటున్నాయి. ఎవరికి వారు బాధ్యత తీసుకుని కాలుష్యంపై శ్రద్ధ తీసుకోకపోతే.. భూగోళం నిప్పుల కొలిమిలా మండుతూనే ఉంటుంది.
Also Read: పాపం భానురేఖ.. బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అకాల మరణం.. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?
