Pakistan : బాంబులతో దద్దరిల్లిన పాకిస్థాన్.. కబాల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రదాడి.. 13 మంది మృతి
పాకిస్థాన్లో మరోసారి బాంబుల మోతమోగింది. స్వాత్ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జంట పేలుళ్లు జరగడంతో 13 మంది మరణించారు.
- Harishth Thanniru
- Published On : April 25, 2023 / 07:14 AM IST
Pakistan
Pakistan: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. స్వాత్ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం (CTD) పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. సోమవారం రాత్రి జరిగిన జంట పేలుళ్లలో పది మంది పోలీసులతో సహా 13 మంది మరణించారు. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. ఉగ్రవాది కూడా తనను తాను పేల్చేసుకున్నట్లు తెలిసింది. ఉగ్రదాడి తరువాత స్వాత్ జిల్లా పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. అయితే, ఈ బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
Pakistan Bomb Blast : పాకిస్థాన్లో బాంబు పేలుడు, ఇద్దరు పోలీసులతో సహా పలువురు మృతి
పేలుళ్లతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన స్థలానికి భద్రతా బలగాలు చేరుకొని ఆ ప్రాంతంను తమ ఆదీనంలోకి తీసుకున్నాయి. వరుసగా రెండు పేలుళ్ల కారణంగా సీటీడీ పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. పేలుడు జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడి జరిగిన పోలీస్ స్టేషన్ పక్కనే మసీదు కూడా ఉంది.
Blast In Pakistan : పాకిస్తాన్ లో భారీ పేలుడు.. నలుగురు మృతి
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ సంఘటనను ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంబంధిత ఘటన వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పాకిస్థాన్ లో ఉగ్రదాడుల ఘటనలు పెరిగాయి. పోలీస్ స్టేషన్లు, పోలీస్ స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో ఖైబర్ ఫక్తున్ఖ్వాలో కూడా ఇలాంటి తరహా ఉగ్రదాడి చోటు చేసుకుంది.
