David Cameron: యుక్రెయిన్ల కోసం స్వయంగా ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన యూకే మాజీ ప్రధాని
పోలాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థకు అందించేందుకు డేవిడ్ కామెరాన్ తన ఇద్దరు సహచరులతో కలిసి స్వయంగా వాహనం నడుపుకుంటూ యూకే నుంచి బయలుదేరి వెళ్లారు.
- Bharath Reddy
- Published On : March 19, 2022 / 03:48 PM IST
Davcid
David Cameron: రష్యాతో యుద్ధం కారణంగా యుక్రెయిన్ ప్రజలు దేశాన్ని వదిలి..శరణార్థులుగా పొరుగు దేశాలకు తరలి పోతున్నారు. లక్షలాది మంది యుక్రెయిన్ వాసులు కట్టుబట్టలతో కిలోమీటర్ల మేర కాలి నడకన పక్కనే ఉన్న పోలాండ్, రోమానియా, హంగేరీ దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ప్రజలు పోలాండ్ చేరుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా గత రెండు వారాలుగా పోలాండ్ లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు యుక్రెయిన్ ప్రజలు. దీంతో వారికి సహాయం చేసేందుకు యురోపియన్ దేశాలతో సహా అమెరికా, భారత్, వంటి దేశాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికా యుక్రెయిన్ ప్రజల సహాయార్ధం $1 బిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించగా, భారత ప్రభుత్వం.. అత్యవసర ఔషధాలు ఇతర సామాగ్రిని అందించింది.
Also Read: Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!
యూకేకి చెందిన కొన్ని స్వచ్చంద సంస్థలు యుక్రెయిన్ ప్రజల పరిస్థితిని అర్ధం చేసుకుని సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈక్రమంలో యూకేలోని ఆక్స్ఫర్డ్షైర్ కౌంటీ సభ్యులు తమ ఫుడ్ ప్రాజెక్టులో భాగంగా “చిప్పీ లార్డర్” అనే స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టి యుక్రెయిన్ వాసుల కోసం సహాయ విరాళాలు సేకరించారు. అయితే ప్రస్తుతం పోలాండ్ లో ఉన్న యుక్రెయిన్ ప్రజలకు ఆ సహాయ సామాగ్రి చేరేలా యూకే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ స్వయంగా ట్రక్ ను నడుపుకుంటూ పోలాండ్ చేరుకున్నారు. శానిటరీ ఉత్పత్తులు, నాప్కిన్ లు, వెచ్చని దుస్తులు మరియు ప్రథమ చికిత్స కిట్లు కలిగిన వాహనాన్ని.. పోలాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థకు అందించేందుకు డేవిడ్ కామెరాన్ తన ఇద్దరు సహచరులతో కలిసి స్వయంగా వాహనం నడుపుకుంటూ యూకే నుంచి బయలుదేరి వెళ్లారు.
Also Read: Russia-Ukraine War : సీ ఆఫ్ అజోవ్ సముద్రంలో ప్రవేశాన్ని తాత్కాలికంగా కోల్పోయిన యుక్రెయిన్
పోలాండ్ చేరుకున్న తర్వాత తన ఇద్దరు సహచరులతో కలిసి రెడ్ క్రాస్ కు విరాళాలను అందజేస్తానని ఆయన చెప్పారు. యూకే మాజీ ప్రధాని విరాళాలు అందించేందుకు స్వయంగా వాహనం నడుపుకుంటూ వెళ్లడంపై యూకేలోని యుక్రెయిన్ రాయబార కార్యాలయం స్పందించింది. బ్రిటిష్ ప్రజల ఉదారతపై కృతఙ్ఞతలు తెలిపిన ఉక్రేనియన్ రాయబారి వడిమ్ ప్రైస్టైకో.. ఇలా వస్తుసామగ్రి కంటే.. నగదు రూపంలో సహాయం అందిస్తే తమ దేశ ప్రజలకు ఉపయోగపడుతుందని కోరారు.
