UK Heatwave : భారత్ లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతుంటే బ్రిటన్ లో మాత్రం ఎండలు మండించేస్తున్నాయి. మండిస్తున్న ఎండలకు బ్రిటన్ వాసులు తాళలేకపోతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగి 40 డిగ్రీలు దాటితే ప్రమాదం అని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈక్రమంలో బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ‘హీట్ ఎమర్జన్సీ’ని ప్రకటించింది. విపరీతంగా పెరుగుతున్న ఈ ఎండలకు అనారోగ్యంబారిని పడే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లండన్తోపాటు ఇంగ్లాండ్లోని పలు ప్రాంతాల్లో వచ్చే కొన్ని వారాలపాటు ఇదేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది.
బ్రిటన్లో చాలా ప్రాంతాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్కు చేరువవుతుండటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని బ్రిటన్ వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో దేశంలో తొలిసారిగా ‘హీట్ ఎమర్జన్సి’ని ప్రకటించారు అధికారు. ఇటువంటి హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ పేర్కొంది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ఎంతో హానికరమన్న మెట్ కార్యాలయం.. ఈ హెచ్చరికలను ప్రజలు సీరియస్గా తీసుకోవాలని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాలను చల్లగా ఉండేటట్లు చూసుకోవాలని సూచించింది. హెచ్చరికలు ప్రకటించిన రోజుల్లో సాధ్యమైనంత వరకు బయట తిరగవదద్ని..బయటి కార్యకలాపాలు, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించింది.
అధిక ఉష్ణోగ్రతల ప్రభావం సున్నితమైన వ్యవస్థలైన విద్యుత్,నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సర్వీసులపై పడే అవకాశం ఉందని మెట్ విభాగం తెలిపింది. మరోవైపు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్ను ప్రకటించింది. ఈ పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులైన వారు కూడా అనారోగ్యం బారినపడవచ్చని.. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇలా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న బ్రిటన్ వాసులు.. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీచ్ల వెంట పరుగులు తీస్తున్నారు. బీచ్ ల్లోనే కాలం గడుపుతున్నారు. ఎక్కడ నీటి చుక్క కనిపించినా మొహంమీద పోసుకుంటున్నారు వేడి తాళలేక.అలాగే అధికారులు హెలికాప్టర్ల ద్వారా అడవుల్లో నీటిని చిమ్ముతున్నారు.