Nithyananda Kailasa: నిత్యానందకు షాకిచ్చిన యూఎన్.. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని వెల్లడి
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Updated on- March 2, 2023 / 01:15 PM IST
Nithyananda Kailasa
Nithyananda Kailasa: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఐక్యరాజ్య సమితి షాకిచ్చింది. భారత్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కోవటమేకాకుండా, నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన ఆయన.. 2019లో భారత్ నుంచి పారిపోయాడు. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గరల్లోని ఓ ద్వీపాన్ని కైలాస పేరుతో ప్రత్యేక హిందూ దేశంగా ఏర్పాటు చేసుకున్న విషయం విధితమే. అయితే, ఇటీవల అతను ఆరోగ్యం క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కైలాస దేశంకు చెందిన ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రత్యక్షం కావటం మరోసారి నిత్యానంద వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 24న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ, సుస్థిర అభివృద్ధి అనే అంశంపై బహిరంగ చర్చా వేదికను నిర్వహించింది. ఈ సమావేశాల్లో కైలాస దేశ ప్రతినిధులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు హాజరయ్యారు. వారిలో విజయప్రియ నిత్యానంద అనే ఓ మహిళ తనని తాను ఐరాసలో కైలాస దేశ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది. నిత్యానందను భారత్ వేధిస్తోందని ఆమె ఆరోపణలు చేసింది. కైలాస దేశ ప్రతినిధులంటూ ఐకాస సమావేశంలో పాల్గొనడం పట్ల ఆ దేశానికి ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తింపునిచ్చిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి వివరణ ఇచ్చింది.
Nithyananda: నేను బతికే ఉన్నా.. ప్రస్తుతం సమాధిలోకి వెళ్లా..
ఐక్యరాజ్య సమితిలో జరిగే సాధారణ సమావేశాల్లో ఎవరైనా పాల్గొని రాతపూర్వకంగా తమ అభిప్రాయం చెప్పొచ్చని ఐరాస ప్రతినిధి ఒకరు తెలిపారు. దీని వల్ల సమావేశం నిర్వహించే కమిటీలకు వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత, వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవాకశం లభిస్తుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించే ప్రణాళికల్లో వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలను ఐకాస స్పందిస్తూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఒకరు తెలిపారు.
