AIADMK leadership: అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారం చుట్టూ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకేను చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం పోటీ పడ్డారు.
చివరకు అన్నాడీఎంకేలోని ఈ.పళనిస్వామి వర్గం నేతలు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. అలాగే, కో-ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్ పదవులను తొలగించారు. పళనిస్వామి వర్గం తీసుకొచ్చిన మొత్తం 16 తీర్మానాలను ఆమోదించారు. అయితే, అందులో చట్టబద్ధత లేదని పన్నీర్ సెల్వం వర్గం కోర్టును ఆశ్రయించింది.
దీంతో జూలై 11న ఏర్పాటు చేసిన ఆ సర్వసభ్య సమావేశం చెల్లదని ఇవాళ మద్రాసు హైకోర్టు పేర్కొంది. మళ్ళీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటింగానే పన్నీర్ సెల్వం మద్దతుదారులు అంబరాన్నంటే ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు.